యుద్ధంలో అమెరికా గెలిస్తే..హోర్ముజ్లో టోల్ వసూలు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్
పశ్చిమాసియాలోని యుద్ధం నేపథ్యంలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్రంగా మారింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ మార్గం గుండానే జరుగుతోంది. అంతటి కీలకమైన ఈ జలసంధిని ఇరాన్ నియంత్రణలోకి తెచ్చుకుని అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం సృష్టించింది. ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోందనే వార్తలు వస్తున్నాయి.
తాజాగా ఈ జలసంధిపై అమెరికా కూడా కన్నేసినట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. 'హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ రుసుము వసూలు చేయడానికి అనుమతించే ఒప్పందాన్ని అంగీకరిస్తారా' అని సోమవారం ట్రంప్ను మీడియా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. 'అసలు టోల్ ఫీజ్ మనం వసూలు చేస్తే ఎలా ఉంటుంది? యుద్ధంలో పూర్తిగా పై చేయి సాధించిన తర్వాత మనమే అలా చేయడం మేలు. మనం ఎందుకు చేయకూడదు? విజేత మనమే. మనం దాదాపుగా గెలిచాం' అని ట్రంప్ అన్నారు.
ఇరాన్ నిరంతరంగా డ్రోన్, క్షిపణి దాడులు చేస్తున్నప్పటికీ, హోర్ముజ్ దిగ్బంధనం కొనసాగిస్తున్నప్పటికీ, ఇరాన్ సైనికంగా ఓడిపోయిందని ట్రంప్ పునరుద్ఘాటించారు. ఇరాన్తో కుదిరే ఏ ఒప్పందంలోనైనా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, చమురు రవాణా స్వేచ్ఛగా జరగడం తప్పనిసరిగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు సోమవారం విలేకరులతో అన్నారు. కాగా, హోర్ముజ్ జలసంధి పరిస్థితి యుద్ధానికి ముందున్న స్థితికి తిరిగి రాదని ఐఆర్జీసీ హెచ్చరించిన సంగతి తెలిసిందే.









Comments