• Apr 19, 2026
  • NPN Log

    న్యూఢిల్లీ  : లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్లకు 2023లో తెచ్చిన చట్టం అమలు చేసేట్లయితే తాము మద్దతిస్తామని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీప్రియాంకాగాంధీ వాధ్రా చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు పేరిట దేశ సమాఖ్య స్వరూపాన్నే మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. శనివారం ఇక్కడ నిర్వహించిన ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడుతూ.. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లకు ప్రతిపక్షాలు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అయితే కేవలం శాశ్వతంగా అధికారంలో ఉండాలన్న ఏకైక లక్ష్యంతో ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తీసుకువచ్చిందని ప్రియాంక ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ బిల్లును తెచ్చారని అన్నారు. అది వీగిపోవడం రాజ్యాంగానికి, దేశానికి, ప్రతిపక్షాలకు ఘన విజయమని పేర్కొన్నారు. కేంద్రానికి ఇది సరైన గుణపాఠం అన్నారు. చేతనైతే 2023 మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శుక్రవారం లోక్‌సభలో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ ఇక ట్రెజరీ బెంచీల్లో కూర్చోలేదని అన్నారు... వారి అసలు ఉద్దేశాన్ని ఈ మాటలు బయట పెట్టాయి.. దీని వెనుక ఉన్న అసలు కుట్ర శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నదే...’’ అని ప్రియాంక ఆరోపించారు. కుల గణన తర్వాత జరిగే డీలిమిటేషన్‌ తమకు వ్యతిరేకంగా ఉంటుందని బీజేపీకి తెలుసు, అందుకే ముందే డీలిమిటేషన్‌ చేయాలని చూశారు. దానికి మహిళా రిజర్వేషన్‌ బిల్లును అడ్డం పెట్టుకున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్‌ తమ ఇష్టానుసారం చేయాలన్నదే వారి అభిమతమని ఆమె చెప్పారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అంగీకరించకపోతే ఇక ప్రతిపక్షాలు ఎన్నికల్లో గెలవలేవని, అఽధికారంలోకి రావని ప్రధాని, హోంమంత్రి చెబుతూ వస్తున్నారని... కేంద్ర ప్రభుత్వం అసలు ఉద్దేశం ఏమిటో వారి ఈ ప్రకటనలు తేటతెల్లం చేస్తున్నాయని అన్నారు. అసలు కుట్ర ఇదేనని తెలిపారు. ఒకవేళ బిల్లు పాసైతే తమదే విజయమని, కాకపోతే ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకం అనిముద్ర వేయవచ్చని భావించారని ప్రియాంక చెప్పారు. తాము మహిళల ఆశాజ్యోతి అని చెప్పుకొనేందుకే బీజేపీ ఈ పని చేసిందని, అయితే అదంత తేలిక కాదని పేర్కొన్నారు. మహిళలకు హాత్రా్‌సలో ఏం జరిగిందో మనం చూశాం... ఒలింపిక్‌ పతక విజేతలకు, ఇతర మహిళలకు ఏం జరిగిందో చూశాం... అని గుర్తుచేశారు.

     

    ప్రతిపక్షాలు ఒక్కటైనప్పుడు మోదీ ప్రభుత్వం ఎలా ఓటమి పాలైందో దేశమంతా చూసిందని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్షాలు మహిళలకు వ్యతిరేకం అన్న బీజేపీ ప్రచారాన్ని ఎలా కాదంటారని ప్రశ్నించగా... ప్రజలు వాస్తవాల్ని చూస్తున్నారని ప్రియాంక చెప్పారు. మహిళలకు జీవన కష్టాలు పెరిగిపోయాయని, వాటిని పట్టించుకోకుండా కేంద్రం చేసే ప్రచార ట్రిక్కులు, మీడియా విన్యాసాలు వారు గ్రహించారని చెప్పారు. అందువల్ల బీజేపీ ప్రచారాన్ని వారు నమ్మరని తెలిపారు. దేశ ప్రజలకు వాస్తవాలు తెలుసు... కేంద్రం వారిని తప్పుదోవ పట్టించలేదు.. అని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై వారికి విశ్వాసం సన్నగిల్లిపోయిందని పేర్కొన్నారు. కాగా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ పార్టీ విధానం ఎప్పుడూ ఒకే విధంగా ఉందని ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వమే ఎప్పటికప్పుడు మాట మార్చుతూ వచ్చిందని ఆయన ఎక్స్‌లో ఆరోపించారు. 2023 సెప్టెంబరులో, 2024 జూన్‌లో, 2026 ఏప్రిల్‌లో.. మూడుసార్లూ కాంగ్రె్‌సది ఒకే మాట అని... మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలన్నదేనని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు మాట మార్చుతూ వచ్చిందని... అందులో రెండు విషయాలు స్పష్టం అవుతూ ఉన్నాయని ఒకటి.. మహిళల ప్రాతినిధ్యంపై నిర్లక్ష్యం, రెండు.. మహిళా రిజర్వేషన్లు సాకుగా దేశ రాజకీయ వ్యవస్థలో పెద్ద ఎత్తున మార్పులు తెచ్చే ప్రయత్నం అని తెలిపారు. డీలిమిటేషన్‌తో మహిళా రిజర్వేషన్లను ముడి పెట్టడం మంచిది కాదని 2024లో మా న్యాయపాత్ర మేనిఫెస్టోలోనే చెప్పాం... ఇప్పుడు అదే జరిగిందని జైరాం రమేష్‌ పేర్కొన్నారు. 2024 ఎన్నికలకు ప్రకటించిన కాంగ్రెస్‌ మేనిఫెస్టో స్ర్కీన్‌షాట్‌ని కూడా తన పోస్ట్‌కి జత చేశారు. అలాగే ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుపై ఎందుకు ముందే అఖిల పక్ష సమావేశం పెట్టి చర్చించలేదని పశ్నించారు. ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ సీట్లు 50 శాతం పెంచుతామని సభలో చెప్పారు... రాజ్యాంగ సవరణ బిల్లులో దానికి సంబంధించిన ప్రతిపాదన ఏదని ప్రశ్నించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement