చర్చల్లో పురోగతి.. కానీ, ఒప్పందానికి చాలా దూరంలో ఉన్నాం: ఇరాన్
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పటికీ, తుది ఒప్పందం ఇంకా చాలా దూరంలోనే ఉందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ గలీబాఫ్ తెలిపారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, కీలక అంశాలపై విభేదాలు ఇంకా పరిష్కారం కాలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా విధించిన నౌకా దిగ్బంధనం, ఆర్థిక ఆంక్షలు చర్చలకు అడ్డంకులుగా మారుతున్నట్టు సమాచారం.
హోర్ముజ్ జలసంధి విషయంలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఇటీవల ఇరాన్ ఈ జలసంధిని తాత్కాలికంగా తెరిచినప్పటికీ, అమెరికా నౌకా దిగ్బంధనం కొనసాగుతుండటంతో మళ్లీ పరిమితులు విధించింది. ఈ నేపథ్యంలో తొమ్మిది ఆయిల్ ట్యాంకర్లు హోర్ముజ్ నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. వీటిల్లో భారత్కు చెందిన నౌకలు కూడా ఉన్నాయి. శనివారం భారత జెండాలు కలిగిన రెండు వాణిజ్య నౌకలపై ఐఆర్జీసీ సైనికులు కాల్పులు జరిపారు. దీంతో నౌకలు వేరే మార్గానికి మళ్లాయి.
అమెరికా తమ నౌకాశ్రయాలపై దిగ్బంధనాన్ని తొలగించకపోతే జలసంధిని పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు అమెరికా మాత్రం ఒప్పందం కుదిరే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. హోర్ముజ్ మార్గం పూర్తిగా సాధారణ స్థితికి రావాలంటే ఇరాన్-అమెరికా మధ్య స్థిరమైన ఒప్పందం కుదరడం అత్యవసరం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.









Comments