టెట్ నోటిఫికేషన్ విడుదల
అమరావతి : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. గురువారం మార్గదర్శకాలు, షెడ్యూలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ఎయిడెడ్ మేనేజ్మెంట్ల పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లో టీచర్ ఉద్యోగం చేయాలనుకునేవారు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలని స్పష్టంచేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు 1ఎ, 1బి, 2ఎ, 2బి నాలుగు పేపర్లకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఒక్కో పేపరుకు రూ.వెయ్యి ఫీజు చెల్లించాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ టీచర్లకూ టెట్ రాసే అవకాశం కల్పించింది. దీంతో 2011కు ముందు టెట్ లేకుండా టీచర్ ఉద్యోగం పొందినవారు ఇప్పుడు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఏర్పడింది. కాగా వారికి విద్యార్హతల్లో కనీస మార్కుల నిబంధనలను మినహాయించింది. అలాగే 2011 జూలై 29కు ముందు బీఈడీ చేసిన, అడ్మిషన్ పొందిన వారికి కూడా విద్యార్హత మార్కుల నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ డీఈడీ చేసిన వారు మాత్రం ఇంటర్మీడియట్లో కనీస అర్హత మార్కులు సాధించి ఉండాలి. టెట్ పరీక్షలకు ఫస్ట్ కమ్ ఫస్ట్ విధానంలో కేంద్రాలు కేటాయిస్తారు.










Comments