• Oct 17, 2025
  • NPN Log

    బీసీలకు న్యాయబద్ధంగా రావలసిన 42 శాతం రిజర్వేషన్లను రెడ్డి సంఘం పేరుతో మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలు అనేక కుట్రలు, కుతంత్రాలతో అడ్డుకోవాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీసీలంతా అగ్గి రాజేస్తారని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు పెంచడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ సామాజిక వర్గానికి నష్టం లేనప్పటికీ బీసీ రిజర్వేషన్లను ఎలాగైనా అడ్డుకొని తీరాలని తెరవెనుక ఎంతోమంది అగ్రకుల శక్తులు కుటీల ప్రయత్నాలు మొదలు పెట్టారని, అందులో భాగంగానే రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలను ముందు పెట్టి బీసీ రిజర్వేషన్లకు గండిగొట్టి బీసీలను రాజకీయంగా అణిచివేయాలని పథకం పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించినప్పుడు గానీ, రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు గానీ, అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేసినప్పుడు గానీ ఎప్పుడూ నోరు ఎత్తని రెడ్డి సంఘం వారు తీరా 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ  జీవోను విడుదల చేయగానే రాత్రికి రాత్రే కోర్టులను వేదికగా చేసుకొని బీసీలకు అన్యాయం తలపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీసీల పక్షాన ధర్మం న్యాయం ఉన్నదని, హైకోర్టులో, సుప్రీంకోర్టులో బీసీలకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం తమకుందన్నారు. ఒకవేళ బీసీ రిజర్వేషన్లు తగ్గితే చరిత్రలో మాధవరెడ్డి, గోపాల్ రెడ్డిలు బీసీ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. వారిని చరిత్ర క్షమించబోతున్నారు. బీసీ రిజర్వేషన్లను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 7న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పూలే, అంబేద్కర్ విగ్రహాల ముందు  శాంతియుతంగా నిరసనలు తెలపాలని మహేందర్ గౌడ్ బీసీ  సమాజానికి పిలుపునిచ్చారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement