తమిళనాడులో మళ్లీ డీఎంకే కూటమిదే అధికారం
హైదరాబాద్ : తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే కూటమే మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం తమిళనాడులోని రాణిపేట జిల్లాలో గల పండియనట్లూర్లో రాహుల్గాంధీ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడి జిల్లా కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశంలో మాట్లాడారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదని, సామాజిక న్యాయానికి నిలువుటద్దమని భట్టి పేర్కొన్నారు. పెరియార్, అన్నాదురై, కరుణానిధి లాంటి మహానీయులు వేసిన పునాదులతో తమిళనాడులో సామాజిక న్యాయం బలంగా ఉందన్నారు. తెలంగాణ పథకాలను వివరిస్తూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. స్టాలిన్ అభివృద్ధి నినాదం, రాహుల్ గాంధీ ప్రేమ సందేశం కలిసి తమిళనాడును మరింత ముందుకు తీసుకెళ్తాయని భట్టి అన్నారు. తమిళ ప్రజలు వేసే ఓటు విభజన రాజకీయాలకు, నియంతృత్వానికి వ్యతిరేకంగా వినిపించే ప్రజాస్వామ్య గొంతుక అని ఆయన అభివర్ణించారు.










Comments