పెట్టుబడిదారులకు అన్ని విధాలా సహకారం
అమరావతి : పారిశ్రామికవేత్తలతో కలిసి రాష్ట్ర భవిష్యత్తును నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. నవంబరులో విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ‘పెట్టుబడులదారుల భాగస్వామ్య సదస్సు’కు సన్నాహకంగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఏపీఈడీబీ) సంయుక్తంగా బెంగళూరులోని లీలా ప్యాలెస్ హోటల్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి భరత్ మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అన్ని రకాల అనుమతులను వేగంగా మంజూరు చేయడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు పెట్టుబడులు పెట్టడం మొదలుకొని ఉత్పత్తులు ప్రారంభించేవరకు ప్రభుత్వం వారికి భాగస్వామిగా మారి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అనుమతుల కోసం పెట్టుబడిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు.









Comments