అడిలైడ్లో రోహిత్, కోహ్లీకి ఘన స్వాగతం.. మాజీ కెప్టెన్ ఫన్నీ వీడియో చూడండి..
దాదాపు ఏడు నెలల విరామం తర్వాత టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్లో పాల్గొంటున్నారు. అయితే పెర్త్లో జరిగిన తొలి వన్డేలో ఇద్దరూ దారుణంగా విఫలమయ్యారు. దీంతో వీరిపై విమర్శలు వెల్లువెత్తాయి. అడిలైడ్లో రెండో వన్డే జరగబోతోంది.
గురువారం అడిలైడ్లో జరగబోయే రెండో వన్డేలో గెలిస్తేనే గిల్ సేన సిరీస్పై ఆశలు సజీవంగా ఉంచుకోగలదు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ కోసం అడిలైడ్ చేరుకున్నారు. వీరికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్లను చుట్టుముట్టారు. విమానాశ్రయంలో వీరితో ఫొటోలు, వీడియోలు కోసం ఎగబడ్డారు. అభిమానులకు ఆటోగ్రాఫ్లు, ఫొటోగ్రాఫ్లు ఇస్తూ రోహిత్, కోహ్లీ బస్సు వరకు వెళ్లారు.
రోహిత్ బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత కూడా అభిమానులు, జర్నలిస్ట్లు అతడిని ఫొటోలు, వీడియోలు తీస్తూనే ఉన్నారు. దీంతో రోహిత్ వారి వైపు చేయి చూపిస్తూ బస్సు ఎక్కి లోపలికి వచ్చేయండి అని నవ్వుతూ సైగలు చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఆడిలైడ్లో గత రెండు వన్డేల్లోనూ ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. ఈసారి కూడా అదే ఫలితం రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Comments