4 బంతుల్లో 4 వికెట్లు.. సెమీస్ ఆశలు ఆవిరి!
క్రికెట్ న్యూస్: మహిళల వన్డే ప్రపంచకప్ 2025 లో శ్రీలంక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓడిపోతుందని అంతా భావించిన మ్యాచ్ లో అనూహ్య మార్పులతో సంచలన విజయాన్ని అందుకుంది. సోమవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. బంగ్లాదేశ్ రేసు నుంచి తప్పుకుంది. కెప్టెన్ ఆటపట్టు నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీయడంతో ఓడిపోయే మ్యాచ్లో శ్రీలంక గెలిచింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 48.4 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటైంది. హసిని పెరెరా(85) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ చమరి ఆటపట్టు( 46) కీలక ఇన్నింగ్స్ ఆడింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షోర్నా అక్తెర్ మూడు వికెట్లు తీయగా.. రబెయా ఖాన్ రెండు, నహిదా అక్తెర్, నిషితా అక్తెర్, మరుఫా అక్తెర్ తలో వికెట్ తీశారు. అనంతరం బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 195 పరుగులే చేసి ఓటమిపాలైంది. షర్మిన్ అక్తర్(64 నాటౌట్), నిగర్ సుల్తానా(77) హాఫ్ సెంచరీలతో సత్తా చాటినా బంగ్లా ఓటమిని ఆపలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు నాలుగు వికెట్లతో రాణించగా.. సుగందిక కుమారి రెండు వికెట్లు పడగొట్టింది.
గేమ్ ఛేంజర్ ఆటపట్టు:
బంగ్లా విజయానికి ఆఖరి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం కాగా.. క్రీజులో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ లో ఉన్న నిగర్ సుల్తానా ఉంది. దీంతో బంగ్లాదేశ్ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు సంచలన బౌలింగ్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించింది. రబేయా ఖాన్(1), నహిదా అక్తెర్(0), నిగర్ సుల్తాన(77), మురుఫా అక్తెర్(0) వరుసగా ఔటయ్యారు. ఇందులో నహిదా అక్తెర్ రనౌట్ కాగా.. రబేయా ఖాన్, మరుఫా అక్తెర్ ఎల్బీగా వెనుదిరిగారు. నిగర్ సుల్తాన క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేరింది. దీంతో బంగ్లా ఊహించని పరాభవాన్ని చవిచూసింది.
సెమీస్ ఆశలు సజీవం:
ఈ టోర్నీలో శ్రీలంకకు ఇదే తొలి గెలుపు. ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడిన శ్రీలంక ఒక విజయం, రెండు మ్యాచుల రద్దుతో 4 పాయింట్స్ సాధించి 6వ స్థానంలో కొనసాగుతోంది. పాకిస్థాన్తో జరిగే ఆఖరి మ్యాచ్లో విజయం సాధించి.. భారత్, న్యూజిలాండ్ తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో ఓడితే శ్రీలంక(Sri Lanka) సెమీస్ చేరుతుంది. 6 మ్యాచ్ల్లో 5 పరాజయాలతో బంగ్లాదేశ్ అధికారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
Comments