• Nov 04, 2025
  • NPN Log

    హైదరాబాద్: నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు వారిని పొడిచి.. పొడిచి.. చంపేశారు. నిందితుల, హత్యకు గల కారణాలపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాచారం పారిశ్రామికవాడలో సోమవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హత్యకు గురుయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని ఇద్దరు దుండగులు సోమవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఉప్పల్‌లోని కళ్యాణ్‌పురి ప్రాంతానికి చెందిన కె. మురళీ కృష్ణ (45)ను కారులో తీసుకెళ్లారు.

     

     

    నాచారం పారిశ్రామికవాడలోని తెలంగాణ ఫుడ్స్‌ పరిశ్రమ సమీపానికి చేరుకున్నారు. నిర్మానుష్య ప్రాంతంలో కారును పార్కు చేసిన దుండగులు అందులోనే మురళీ కృష్ణ ముఖంపై పిడిగుద్దులు గుద్దడమే కాకుండా వీపు భాగంలో, భుజంపై కత్తిపోట్లతో దాడి చేశారు. దాంతో మురళీకృష్ణ  కారు దిగి పారిపోయాడు. దుండగులు అతడిని కొద్ది దూరం వెంబడించారు. అతను దొరకకపోవడంతో తిరిగి హడావిడిగా కారు ఎక్కి పారిపోయిన విజువల్స్‌ సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కత్తిపోట్లకు గురైన మురళీ కృష్ణ తీవ్ర రక్తస్రావంతో 200 మీటర్ల దూరం పరుగెత్తి రోడ్డు పక్కన కుప్పకూలిపోయాడు.

     


    స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌ సిబ్బంది ప్రథమ చికిత్స చేస్తుండగా తుదిశ్వాస విడిచాడు. నాచారం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. మురళీ కృష్ణ కారు ఎందుకు ఎక్కాడు? అతడికి, దుండగులకు మద్యం మత్తులో ఘర్షణ జరిగిందా, పాతకక్షలే హత్యకు కారణామా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లేబర్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న మురళీ కృష్ణకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. తన భర్త ఆదివారం ఉదయం 9:30 గంటల సమయంలో తన అన్నను కలవడానికి జిల్లెలగూడకు వెళ్లాడని, అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో తన మేనల్లుడి సెల్‌ఫోన్‌తో కాల్‌ చేసి రేపు ఉదయం ఇంటికి వస్తానని చెప్పాడని భార్య కొయ్యాడ తులసి రత్నం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement