తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాజధాని హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వరుసగా నాలుగు రోజులు పాటు వర్షాలు పడతాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఏప్రిల్ 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురవనున్నట్లు వివరించింది. అలాగే మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. రాయలసీమలో ఏప్రిల్ 20 నుంచి 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈదురు గాలుల వేగం గంటకు 30 నుంచి 50 కిలోమీటర్లుగా ఉంటుందని స్పష్టం చేసింది.
వేసవి కాలం నేపథ్యంలో వేడి వాతావరణంపై వివరాలను కూడా అందించింది. ఏప్రిల్ 19, 20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, యానాంలో వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని వివరించింది. ఏప్రిల్ 19వ తేదీ వాతావరణాన్ని గమనిస్తే.. రోజంతా ఎండ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. అలాగే రాత్రి 7.00 గంటల తర్వాత పశ్చిమ రాయలసీమలో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయని పేర్కొంది.
తెలంగాణలో ఆదివారం వాతావరణం చూస్తే.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండ ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ప్రారంభమై.. రాత్రి వరకు అక్కడక్కడా కురుస్తాయి. హైదరాబాద్లో సాయంత్రం 3.00 గంటల తర్వాత అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. తూర్పు తెలంగాణలో మాత్రం ఎండ వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వివరించింది.









Comments