దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ స్థానాలు తగ్గవ్
న్యూఢిల్లీ : లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాలు తగ్గబోవని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. విజయవంతంగా జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గుతాయన్న ప్రచారం తప్పు అని చెప్పారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పథనంతిట్ట జిల్లా తిరువల్లలో శనివారం జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. లోక్సభ సీట్ల పెంపు వల్ల రాష్ట్రాలన్నింటికీ లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలు విజయవంతంగా జనాభాను నియంత్రించాయి. జనాభా వృద్ధి తక్కువగా ఉన్నా ఈ రాష్ట్రాల లోక్సభ స్థానాలు తప్పనిసరిగా తగ్గవు’ అని ఆయన అన్నారు. దక్షిణాది రాష్ట్రాల లోక్సభ స్థానాలను పరిరక్షించడానికి పార్లమెంటు అవసరమైన చర్యలు తీసుకుంటుందని మోదీ వెల్లడించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పన కోసం పార్లమెంటు, రాష్ట్రాల శాసనభల స్థానాల పెంపుకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేయడానికి ఈ నెల 16-18 తేదీలకు పార్లమెంటు సమావేశాలను పొడిగిస్తామన్నారు. దీంతో లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు పెరుగుతాయని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాలు తగ్గుతాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ చెప్పిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నేతలు తమ ప్రమాదకర వ్యాఖ్యలతో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని మోదీ ఆరోపించారు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో భారత్ను గల్ఫ్ దేశాలు శత్రుదేశంగా పరిగణించాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. గల్ఫ్ దేశాలకు ఆగ్రహం తెప్పించేలా కాంగ్రెస్ నేతల ప్రకటనలు ఉన్నాయన్నారు. ‘కాంగ్రెస్, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ నాయకులకు నేనో విషయం చెప్పదలుచుకున్నా. రాజకీయాల స్థానం రాజకీయాలదే. ఎన్నికలు వచ్చి పోతుంటాయి. నాకు మాత్రం లక్షల మంది మలయాళీల భద్రతే ప్రాధాన్యం. అందుకు కట్టుబడి ఉంటాన్నేను.’








Comments