బోయకొండకు ఏటా రూ.16.39 కోట్ల రాబడి
పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గంలోని చౌడేపల్లె మండలం దిగువపల్లె గ్రామం బోయకొండపై వెలసిన గంగమ్మ ఆలయాన్ని 1990లో నాటి పుంగనూరు ఎమ్మెల్యే ఎన్.రామకృష్ణారెడ్డి దేవదాయశాఖకు అప్పగించి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. కొండపైకి పైపులైను ద్వారా తాగునీరు, విద్యుత్, రోడ్డు తదితర పనులను చేయించగా తర్వాత పుంగనూరు ఎమ్మెల్యేలు ఎన్.అమరనాథరెడ్డి, పి.రామచంద్రారెడ్డి హయాంలో వసతిగృహాలు, రోడ్లు, పుష్కరిణి, కల్యాణకట్ట, షాపింగ్కాంప్లెక్స్, ఆలయ పరిపాలన భవనాలు, విద్యుత్ దీపాలు తదితర అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి.
రూ.16.39 కోట్లకు చేరిన ఆదాయం
బోయకొండ గంగమ్మ ఆలయం 1982నుంచి ఎండోమెంట్ ఆధీనంలో చిన్నగుడిగా ఏటాఆదాయం రూ.25వేలు ఉండేది. 1990లో కార్యనిర్వహణాధికారి, సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. దీంతో బోయకొండ గ్రామదేవత ఖ్యాతి కర్ణాటక, ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు వరకు వ్యాపించింది. ఏటా ఆదాయం రూ.16.39 కోట్లకు చేరింది. 2011-12లో రూ.3.89 కోట్లు, 2012లో రూ.3.77 కోట్లు, 2013లో రూ.3.68 కోట్లు, 2014లో రూ.5.06 కోట్లు, 2015లో రూ.5.35 కోట్లు, 2016లో రూ.6.10 కోట్లు, 2017లో రూ.5.45 కోట్లు, 2018లో రూ.6.98కోట్లు, 2019లో రూ.7.21 కోట్లు, 2020లో రూ.3.45కోట్లు, 2021లో రూ.9.27 కోట్లు, 2022లో రూ.11.36 కోట్లు, 2023లో రూ.13,85 కోట్లు, 2024లో రూ.12.20 కోట్లు,2025-26లో ఆదాయం రూ.16,30,97,620కి పెరిగింది.
కర్ణాటక భక్తులే అధికం..
బోయకొండ గంగమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్లోఉన్నా భక్తులు మాత్రం అధికంగా కర్ణాటక నుంచే వస్తున్నారు.ప్రత్యేక పూజలు, మొక్కులు తీర్చుకోవడానికి బంధుమిత్రులతో వచ్చి ఇక్కడే విందులు ఇస్తున్నారు.ఈ క్రమంలో బోయకొండ గంగ మ్మ ఆలయ కమిటీలో కర్ణాటక వారికీ అవకాశాలుంటున్నాయి. కర్ణాటక నుంచి కూడా బస్సులు నడుస్తున్నాయి. బోయకొండ గంగమ్మ ఆలయానికి భక్తులతోపాటు ఆదాయమూ ఏటా పెరుగుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం లెక్కించగా ఆలయ చరిత్రలో తొలిసారి రూ.16.39 కోట్లు వచ్చింది. గత ఏడాది కంటే రూ.4.11 కోట్లు ఎక్కువగా రావడంతో ఆలయాధి కారులు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఆలయాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ: ఏకాంబరం, డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈవో
బోయకొండ గంగ మ్మ ఆలయాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నిధుల మంజూరు, అనుమతులకు ప్రయత్నిస్తున్నాం. నేను ఈవోగా వచ్చిన ఒకటిన్నరేళ్లలో ఆలయ ఆదాయం రూ.4.11 కోట్లు పెరిగింది. రూ.వెయ్యితో వేద ఆశీర్వాదం, రూ. 500తో లఘుదర్శనం ప్రవేశపెట్టగా మంచి ఫలితాలు వచ్చాయి. అన్నదానం కోసం రూ.3.50 కోట్లు, గోశాలకు రూ.15లక్షలు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం.










Comments