బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రతిఇంటికి తాగునీరు అందిస్తాం: కేటీఆర్
హైదరాబాద్ : కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలకు స్పెషల్ ఇంటెన్సీవ్ రివ్యూ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్ సిటీలో 24 గంటల తాగునీటిని సరఫరా చేస్తామని అన్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చిన తీరుగానే ప్రతి ఇంటికి మంచి నీరు అందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆరే అని.. హైదరాబాద్లో 24 గంటల తాగునీరు ఇచ్చేది కూడా కేసీఆరే అని వెల్లడించారు.
కాంగ్రెస్ పరిపాలన గురించి అవగాహన ఉంది కాబట్టే నగర ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి అన్నారు. కేసీఆర్ కట్టిన ఫ్లై ఓవర్లు, ఆసుపత్రులు, భవనాలను ఓపెన్ చేస్తూ తామే చేశామని అబద్ధాలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో కేవలం అభివృద్ధిపైన మాత్రమే దృష్టి సారించామని.. ఈసారి అధికారంలోకి వచ్చాక పార్టీకి అండగా ఉన్న కార్యకర్త, నాయకుడికి తగిన అవకాశం, గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏ ఒక్కరి ఓటు కోల్పోకుండా బీఆర్ఎస్ శ్రేణులు పనిచేయాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.








Comments