బస్సులో ఫోన్ చోరీ.. యాప్ ద్వారా రూ. 6.15 లక్షలు బదిలీ
హైదరాబాద్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి నుంచి ఫోన్ను కొట్టేసిన దొంగ.. అందులోని యాప్ ద్వారా రూ.6.15లక్షలు కాజేశాడు. బోయినపల్లి పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ తిరుపతిరాజు, ఎస్ఐ శివశంకర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ బోధన్కు చెందిన ఎం. ప్రసాదరావు ఈ నెల 2న ఉదయం బోయినపల్లి బస్టాప్లో నాందేడ్ బస్సు ఎక్కి బోధన్ బయలుదేరాడు. కొద్దిదూరం ప్రయాణించాక తన సెల్ఫోన్ పోయిందని గుర్తించాడు. బోధన్ కు వెళ్లి మొబైల్ నంబర్ను బ్లాక్ చేసి అదే నంబర్తో అతను కొత్త సిమ్ తీసుకున్నాడు. కానీ, సెల్ఫోన్ లేకపోవడంతో అతను సిమ్ను ఉపయోగించలేదు.ఈ నెల 6న సాయంత్రం ఫోన్ కొనుగోలు చేసి, సిమ్ ద్వారా ఫోన్ను తనిఖీ చేశాడు. అయితే, అతని కెనరా బ్యాంకు అక్కౌంట్ నుంచి రూ.4 లక్షలు, మరో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి రూ.2.15 లక్షలు బదిలీ అయినట్లు మెసేజ్లు వచ్చాయి. ఇందులో కొంత మొత్తం ఖర్చు చేసినట్లు మెస్సేజ్లు వచ్చాయి. ఫోన్ పే యాప్ ద్వారా డబ్బులు లావాదేవీలు జరిగాయని గ్రహించిన బాధితుడు మంగళవారం బోయినపల్లి పోలీసులను ఆశ్రయించాడు. అయితే, బాధితుడు కొత్త సిమ్ తీసుకుని సకాలంలో వాడకపోవడం వల్లనే నిందితుడికి అవకాశం దొరికిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments