ఫర్హాన్ గన్ పేలిస్తే.. అభిషేక్, గిల్ బ్రహ్మోస్ ప్రయోగించారు: పాక్ మాజీ క్రికెటర్
ప్రస్తుత ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్లు వివాదాలకు కేంద్రబిందువులుగా మారాయి. రెండు మ్యాచ్ల్లోనూ టీమిండియానే గెలిచినప్పటికీ.. ఆటగాళ్ల ప్రతిభ కంటే ఇతర విషయాలే చర్చనీయాంశాలుగా మారాయి. తొలి మ్యాచ్లో షేక్ హ్యాండ్ వివాదం చుట్టుముట్టగా.. ఆదివారం జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ తర్వాత ఫర్హాన్ గన్ సెలబ్రేషన్ వివాదాస్పదంగా మారింది. హాఫ్ సెంచరీ తర్వాత ఫర్హాన్ తన బ్యాట్ను ఏకే 47 గన్లా పట్టుకుని షూట్ చేసినట్టుగా సంజ్ఞలు చేశాడు.
హాఫ్ సెంచరీ చేసి పాకిస్థాన్కు గౌరవప్రదమైన స్కోరు అందించిన ఫర్హాన్ సంతోషం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. ఈ నేపథ్యంలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్పై పాకిస్థాన్ జట్టు మాజీ బౌలర్ డానిష్ కనేరియా ప్రశంసలు కురిపించాడు. పాకిస్థాన్ చర్యకు, భారత్ ప్రతిచర్య అద్భుతంగా ఉందని కొనియాడాడు. 'ఫర్హాన్ ఏకే 47తో కాల్పులు జరిపినట్టు సంజ్ఞలు చేశాడు. కానీ, అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఏకంగా బ్రహ్మోస్నే ప్రయోగించారు. భారత్ ఓపెనర్ల దూకుడు ముందు పాక్ బౌలర్లు చేతులెత్తేశారు' అని కనేరియా పేర్కొన్నాడు.
'అభిషేక్, గిల్ లాంటి ప్లేయర్లు ఉంటే ఎంత భారీ లక్ష్యమైనా చిన్నగానే కనిపిస్తుంది. వారిద్దరూ క్లాస్ ప్లేయర్లు. ఫకార్ జమాన్ అవుట్ను వివాదాస్పదం చేయాలని పాకిస్థాన్ ప్రయత్నిస్తోంది. ఫకార్ కచ్చితంగా ఔటే. సంజూ శాంసన్ అద్భుమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ సమయంలో సంజూ గ్లౌజ్లు బంతి కిందే ఉన్నాయి' అని డానిష్ కనేరియా వ్యాఖ్యానించాడు.
Comments