• Jul 26, 2026
  • NPN Log

    గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. బిహార్‌కు చెందిన పారా అథ్లెట్ ఝండూ కుమార్ భారత్‌కు తొలి పతకాన్ని అందించాడు. పురుషుల హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించాడు. కాగా ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. అతడికి అభినందనలు తెలిపారు.

    ‘కామన్వెల్త్ గేమ్స్ 2026లో హెవీవెయిట్ పారా పవర్ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం సాధించిన ఝండూ కుమార్ ప్రదర్శన అద్భుతం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు. అపారమైన శక్తి, సంకల్పం, ఎన్నో ఏళ్ల క్రమశిక్షణతో కూడిన సాధనకు ఈ విజయం నిదర్శనం. ఎదురైన అన్ని సవాళ్లను అధిగమించి అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను నిలబెట్టారు. ఆయన విజయం కోట్లాది మంది భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.

    ఈ పోటీలో 190 కిలోల బరువును ఎత్తిన ఝండూ.. 130.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఫైనల్‌లో తొలి ప్రయత్నంలో 181 కిలోల బరువును సునాయసంగా ఎత్తిన అతడు.. రెండో ప్రయత్నంలో 190 కిలోలను లిఫ్ట్ చేశాడు. కానీ చివరి ప్రయత్నంలో 196 కిలోల బరువును ఎత్తేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నైజీరియాకు చెందిన రిలువాన్ ఇద్రిస్ 132.8 పాయింట్లతో స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇంగ్లండ్‌కు చెందిన మాథ్యూ హార్డింగ్ 131.0 కిలోలతో రజత పతకం దక్కించుకున్నాడు. కేవలం 0.1 కిలో తేడాతో ఝండూ రజత పతకాన్ని చేజార్చుకోవడం గమనార్హం.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement