లండన్లో సౌదీ యువరాజు మృతి.. డ్రగ్స్, మద్యం మిశ్రమమే కారణం..
గతేడాది లండన్లోని ఒక విలాసవంతమైన హోటల్లో మరణించిన సౌదీ యువరాజు కేసులో బ్రిటన్ దర్యాప్తు అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. సౌదీ రాజ కుటుంబానికి చెందిన 29 ఏళ్ల యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ బిన్ జలావీ అల్ సౌద్ లండన్లోని ఒక విలాసవంతమైన హోటల్లో గతేడాది నవంబర్లో మరణించారు.
అనేక రకాల మత్తుపదార్థాలు, మద్యం, అలాగే కొన్ని ప్రిస్క్రిప్షన్ మందులను కలిపి తీసుకోవడం వల్ల గుండె ఆగిపోయి మరణించినట్టు దర్యాప్తులో తేలింది. కోర్టు ఈ మరణాన్ని 'అనుకోకుండా ప్రమాదకర చర్యల వల్ల సంభవించిన మరణం'గా నమోదు చేసింది. ఆత్మహత్య లేదా ఇతరుల ప్రమేయానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని కోర్టు పేర్కొంది.
యువరాజు 2025 నవంబర్ 19న లండన్లోని కెన్సింగ్టన్ ప్రాంతంలోని మారియట్ హోటల్లో బస చేశారు. నవంబర్ 25వ తేదీ ఉదయం హోటల్ సిబ్బంది ఆయనను గదిలోని బాత్రూమ్ నేలపై అపస్మారక స్థితిలో గుర్తించారు. హోటల్ సిబ్బంది వెంటనే అత్యవసర సేవలకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది చేరుకునేటప్పటికే యువరాజు మరణించారు.
పోస్ట్మార్టమ్లో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రిన్స్ అబ్దుల్లా రక్తంలో ప్రతి 100 మిల్లీలీటర్లకు 222 మిల్లీగ్రాముల ఆల్కహాల్ గాఢత ఉన్నట్లు తేలింది. ఇక, పార్టీ డ్రగ్గా పిలిచే గామా-హైడ్రాక్సీబ్యూటిరేట్ (GHB) ప్రాణాంతక స్థాయిలలో ఉండటంతో పాటు, గంజాయి, జానాక్స్, ఆందోళన నివారణ మందుల ఆనవాళ్లను కూడా ఆయన శరీరంలో కనుగొన్నారు. ఈ పదార్థాల కలయిక గుండెపోటుకు దారితీసి, చివరికి అతడి మరణానికి కారణమైందని వైద్య నిపుణులు నిర్ధారించారు.









Comments