ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1119 కోట్ల ప్రాజెక్టు
కంది : సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి రూ.1,119 కోట్ల విలువైన భారీ వర్క్ ఆర్డర్ లభించింది. భారత సైన్యంలోని పదాతి దళాలు వినియోగించే బీఎంపీ-2 వాహనాల ఓవర్హాలింగ్ పనులకు సంబంధించిన కాంట్రాక్టు దక్కింది. ఏడాదికి 100 బీఎంపీ-2 వాహనాలకు ఎద్దుమైలారం పరిశ్రమలో ఓవర్హాలింగ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయని పరిశ్రమ ఉద్యోగులు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో పరిశ్రమ గత వైభవం సంతరించుకుంటుందని ఏవీఎన్ఎల్ (ఆర్మ్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్) సీఎండీ సజయ్ ద్వివేది తెలిపారు. కాగా, పరిశ్రమకు ఈ ప్రాజెక్టు లభించడంపై బీఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఘ్) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మెదక్ ఎంపీ రఘునందన్రావు, బీజేపీ సీనియర్ నేత నర్సింహారెడ్డి సహకారం వల్ల కేంద్ర రక్షణ శాఖ నుంచి వర్క్ ఆర్డర్ మంజూరైందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ రఘనందన్రావును కలిసిన బీఎంఎస్ నాయకులు, పరిశ్రమ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments