బాల్య వివాహాలు విద్రోహం.. పౌష్టికాహారంతోనే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం – గడేకళ్ళులో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన సీడీపీఓ డాక్టర్ బి.ఎన్.శ్రీదేవి – చిన్న వయసులోనే ఆరోగ్య లోపాల గుర్తింపునకు స్క్రీనింగ్
విడపనకల్లు:
బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల పెళ్లి చేసుకునే పిల్లల భవిష్యత్తు, ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటాయని ఐసీడీఎస్ సీడీపీఓ డాక్టర్ బి.ఎన్. శ్రీదేవి హెచ్చరించారు. మండల పరిధిలోని గడేకళ్ళు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తల్లులతో నిర్వహించిన సమావేశంలో బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.
అనంతరం కేంద్రంలో పిల్లలకు స్క్రీనింగ్ నిర్వహించారు. చిన్న వయసులోనే పిల్లల్లోని ఆరోగ్య లోపాలను గుర్తిస్తే, తగిన చికిత్స ద్వారా వారి ఆరోగ్యాన్ని త్వరగా మెరుగుపరచవచ్చని శ్రీదేవి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారమే పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఈ సందర్భంగా పిల్లల వయస్సుకు తగ్గ బరువు, ఎత్తులను కొలిచి, లోపాలు ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తల్లులకు సూచించారు. పౌష్టికాహార ప్రాముఖ్యతను లబ్ధిదారులందరూ గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ విజయకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయా కేంద్రాల పిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.










Comments