శంషాబాద్ సమీపంలో దారి దోపిడి.. దొంగలు అరెస్ట్
హైదరాబాద్ : దారి దోపిడీకి పాల్పడిన దొంగలు.. చిన్న తప్పు చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్లో చోటు చేసుకుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్లో రైలు దిగిన ఒక కుటుంబం కొత్తూరుకు ఆటోలో బయలుదేరింది. ఈ సందర్భంగా శంషాబాద్ సర్కిల్ పరిధిలోని గ్యాస్మీయా గూడ సమీపంలో ఆటోలో వస్తున్న ఆ కుటుంబన్ని కొందరు దుండగులు అడ్డగించారు. వారిపై దాడి చేసి రూ. 1,800 నగదు, రెండు వెండి చైన్లతోపాటు ఉంగరం, రెండు మొబైల్ ఫోన్లు ఎత్తుకెళ్లారు. అలాగే గూగుల్ పే ద్వారా వారి వద్ద నుంచి రూ.5 వేలు నగదును దొంగలు తమ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు.
ఈ దోపిడీ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ వారిని బెదిరించి.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. బాధితులు చెల్లించిన గూగుల్ పే నెంబర్ ఆధారంగా దొంగలు ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గుర్తించారు.
ఈ దోపిడీకి పాల్పడిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదుతోపాటు వెండి సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితులు అబ్దుల్ యాసిన్, ఆటో డ్రైవర్ మహమ్మద్ మూసిన్, అబ్దుల్ మోసిన్, అతీఫ్ ఖాన్లను అరెస్టు చేసినట్లు శంషాబాద్ పోలీసులు వివరించారు.










Comments