కంది రైతులకు ఇన్సూరెన్స్ ధీమా.. 'పొలం పిలుస్తోంది'లో వ్యవసాయాధికారులు – ఆగస్టు 15 వరకు విత్తుకునే వెసులుబాటు – ఎకరాకు రూ.80లతో మీసేవలో నమోదుకు సూచన
విడపనకల్లు:
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు పంటల బీమా ద్వారా లబ్ధి పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. మండల పరిధిలోని చీకలగురికి, కరకముక్కల గ్రామాల్లో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) కైలాస్నాథ్ మాట్లాడుతూ... రైతులు కంది పంటను ఆగస్టు 15వ తేదీ వరకు విత్తుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రైతులకు బీమా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కంది పంటకు ఎకరాకు రూ.80 చొప్పున స్థానిక మీసేవ కేంద్రాలలో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
అనంతరం చీకలగురికి గ్రామంలో రైతు రామాంజనేయులు పొలంలో కంది విత్తనాలు వేస్తున్న సమయంలో అధికారులు ఆయనతో మాట్లాడి, పంట బీమా ప్రాముఖ్యతను వివరించారు. తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలని రైతుకు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే) సిబ్బంది షేక్షావలి, చిక్కన్న తదితరులు పాల్గొన్నారు










Comments