కేంద్రం వైఖరికి నిరసనగా మడకశిరలో కాంగ్రెస్ భారీ ర్యాలీ – శాంతియుత నిరసనలపై పోలీసుల అణచివేతపై ఆగ్రహం – మడకశిర రాజీవ్ సర్కిల్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రదర్శన
మడకశిర:
నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడకశిర పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాజీవ్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ సర్కిల్ వరకు హోరెత్తే నినాదాలతో సాగింది. అనంతరం అక్కడ నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న నీట్ కుంభకోణంపై ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత క్రూరంగా ఉందని మండిపడ్డారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన లోక్సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, ఏఐసీసీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మరియు ఇతర అగ్రనాయకుల పట్ల కేంద్ర అమిత్ షా ఆధీనంలోని ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన నియంతృత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తోందని, ప్రశ్న అడిగిన వారిపై పోలీసు బలగాలను ప్రయోగించి అణచివేయాలని చూస్తోందని ఆరోపించారు. నీట్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు మరియు విద్యార్థి సంఘాల నాయకులు విశేషంగా పాల్గొన్నారు.










Comments