పదవులు కాదు ప్రజలే బలం
పదవులు కాదు... ప్రజలే బలం!
పెద్ద పాలవేడు సీసీ రోడ్డు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సందేశం
"పదవులు ఉన్నా... లేకున్నా... ప్రజల మధ్యే ఉండడమే నా లక్ష్యం. ప్రజల ఆశయాలే నాకు మార్గదర్శకం" అని సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు. బుచ్చినాయుడు కండ్రిగ మండలం పెద్ద పాలవేడు గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు.ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం వంటి అవసరాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని వివరించారు. వీబీ జీ రామ్జీ పథకం ద్వారా ప్రతి స్మశానానికి రహదారులు ఏర్పాటు చేసి, ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే తెలుగుగంగ సాగునీటి కాలువల ద్వారా రైతులకు సమృద్ధిగా సాగునీరు అందేలా కృషి చేస్తున్నామని చెప్పారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పీఎం అవాస్ యోజన పథకం ద్వారా ప్రతి ఒక్కరికి ఇళ్ళు కట్టుకునే సౌకర్యం కల్పించనున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్లకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతోనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానమే తనకు అతిపెద్ద బలం అని చెప్పిన ఆదిమూలం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా నిరంతరం సేవ చేస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ పదవులు శాశ్వతం కాకపోయినా, ప్రజల ప్రేమాభిమానాలు శాశ్వతమని ఆయన వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామ అభివృద్ధి, రైతు సంక్షేమం, ప్రజా సేవ అనే మూడు లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల సహకారంతో సత్యవేడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.టీబీ ముక్త భారత నిర్మాణంలో ఆరోగ్య శాఖా సూచనలు,సలహాలు పాటించాలని ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బి ఎన్ కండ్రిగ మండలం టీడీపీ మాజీ అధ్యక్షులు ఎస్ సుధాకర్ నాయుడు,పార్లమెంట్ స్థాయి,నియోజకవర్గ స్థాయి ఎన్ డి ఏ కూటమి ముఖ్య నాయకులు,మండల స్థాయి అధికారులు, గ్రామస్తులు,ఎమ్మెల్యే అభిమానులు, డీవీఎంసీ మెంబెర్ లు అయ్యప్ప, గుత్తి త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.









Comments